కృష్ణా పుష్కరాలకు విజయవాడ వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు !

04:49:00 Add Comment



కృష్ణా పుష్కరాలకు పశ్చిమ గోదావరి జిల్లా భక్తులకు అనుకూలంగా ఉండే విధంగా ఈస్‌ కోస్ట్ రైల్వే ఐదు ప్రత్యేక రైళ్ళను ప్రకటించింది. పుష్కరం స్పెషల్‌ ట్రైన్‌ పేరుతో ఈ రైళ్ళను నడపనున్నారు. రాయగడ్ నుంచి కృష్ణా కెనాల్‌ జంక్షన్‌కు ట్రైన్‌ నెంబరు 08505 ఆగస్టు 11, 16, 19, 22న రాయగడ్‌లో మధ్యాహ్నం 2.30 (14.30) గంటలకు బయలుదేరి మరుసటిరోజు తెల్లవారుజామున 4.15 గంటలకు కృష్ణాకెనాల్‌ జంక్షన్‌కు చేరుకుంటుంది. ట్రైన్‌ నెంబరు 08506 కృష్ణాకెనాల్‌ జంక్షన్‌ నుంచి రాయగడ్‌కు రాత్రి 8.45 (20.45) గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9 గంటలకు రాయగడ్ చేరుకుంటుంది. ఈ రైలు కృష్ణాకెనాల్‌ జంక్షన్‌ నుంచి ఆగస్టు 12, 17, 20, 23 తేదీల్లో ప్రయాణిస్తుంది. ఈ రెండు రైళ్ళు మార్గమధ్యంలో ఇరువైపులా పార్వతీపురం టౌన్‌, పార్వతీపురం, సీతానగరం, బొబ్బిలి, డొంకినవలస, గజపతినగరం, గరుగుబిల్లి, కొత్తవలస, సింహాచలం, దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, గుణదల, విజయవాడలలో ఆగనుంది. అంతేకాక ప్రధాన రైల్వేస్టేషన్లయిన రాయగడ్, విజయనగరం, విశాఖపట్నంలలో ఎక్కువ సమయం ఆగుతుంది. ఈ రైళ్లలో సెకండ్‌ క్లాస్‌ సిట్టింగ్‌ 10 బోగీలు, స్లీపర్‌క్లాస్‌ మూడు బోగీలు, ఏసి 3-టైరు ఒక బోగి, గార్డు కం లగేజీ వ్యాన్స్‌ రెండు ఉంటాయని తెలిపారు.

విశాఖపట్నం - గుంటూరు జంక్షన్‌ - విశాఖపట్నం
విశాఖపట్నం నుంచి ట్రైన్‌ నెంబరు 08507 ఆగస్టు 11, 12, 13, 14, 16, 17, 19, 20, 21, 22 తేదీలలో రాత్రి 11 (23.00) గంటలకు బయలుదేరి గుంటూరుకు, మరుసటిరోజు ఉదయం 6.45 గంటలకు చేరుకుంటుంది. ట్రైన్‌ నెంబరు 08508 గుంటూరులో ఉదయం 8.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.20 (17.20) గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు ఆగస్టు 12, 13, 14, 15, 17, 18, 20, 21, 22, 23 ఈ రెండు రైళ్ళు విశాఖపట్నం, దువ్వాడ, అనకాపల్లి, తుని సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, గుణదల, మంగళగిరిలలో కూడా ఆగుతాయి. ఈ రైళ్ళలో గార్డుకం లగేజీ వ్యాన్స్‌ రెండు బోగీలు, సెకండ్‌ సిట్టింగ్‌ ఎనిమిది బోగీలు, స్లీపర్‌ క్లాసెస్‌ ఐదు బోగీలు ఉంటాయి.

విజయవాడ - విశాఖపట్నం - విజయవాడ
విజయవాడలో ట్రైన్‌ నెంబరు 07753 రాత్రి 11.30 (23.30) గంటలకు బయలుదేరి విశాఖపట్నం మరుసటిరోజు ఉదయం 6.30 గంటలకు చేరుకుంటుంది. ఈ ట్రైన్‌ ఆగస్టు 11, 12, 13, 14, 18, 19, 20, 21 తేదీల్లో ప్రయాణిస్తుంది. విశాఖపట్నం నుంచి ట్రైన్‌ నెంబరు 07754 ఉదయం 8.40 గంటలకు బయలుదేరి సాయంత్రం 3.50 (15.50) గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఈ రెండు రైళ్ళు విజయవాడ, గుణదల, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నంలలో ఆగుతాయి. ఈ రైలులో గార్డు కం లగేజీ వ్యాన్స్‌ రెండు, సెకండ్‌ సిట్టింగ్‌ ఐదు బోగీలు, స్లీపర్‌క్లాస్‌ ఏడు బోగీలు, 3-టైర్‌ ఏసి రెండు బోగీలు, 2-టైర్‌ ఏసీ ఒక బోగి మొత్తం 17 బోగీలతో రైలు ఇరువైపులా ప్రయాణిస్తుంది.

పూరీ - గుంటూరు - పూరీ
పూరీ నుంచి ట్రైన్‌ నెంబరు 08405 ఉదయం 11.30 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.30 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. ఈ ట్రైన్‌ ఆగస్టు 11, 16, 19, 22 తేదీలలో ప్రయాణిస్తుంది. గుంటూరు నుంచి ట్రైన్‌ నెంబరు 08406 రాత్రి 7 (19.00) గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 11.25 గంటలకు పూరీ చేరుకుంటుంది. మార్గ మధ్యంలో ఉన్న అన్ని ప్రధాన స్టేషన్లలో ఈ రెండురైళ్ళు ఆగుతాయి. గార్డ్‌ కం లగేజీవ్యాన్‌లు రెండు బోగీలు, సెకండ్‌సిట్టింగ్‌ 9 బోగీలు, స్వీపర్‌ క్లాసులు మూడు బోగీలు, 3-టైర్‌ ఏసీ ఒక బోగి ఉంటుంది.

తిరుపతి - విశాఖపట్నం - తిరుపతి
తిరుపతి నుంచి ట్రైన్‌ నెంబరు 07747 మధ్యాహ్నం 2 (14.00) గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 4.45 గంటలకు విశాఖపట్నం చేరుకుటుంది. ఈ రైలు ఆగస్టు 12, 19 తేదీల్లో మాత్రమే ప్రయాణిస్తుంది. విశాఖపట్నం నుంచి ట్రైన్‌ నెంబరు 07748 ఉదయం 5.45 గంటలకు బయలుదేరి రాత్రి 7.45 (19.45) గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ ట్రైను ఆగస్టు 13, 20 తేదీల్లో మాత్రమే ప్రయాణిస్తుంది. మార్గమధ్యంలో గూడూరు, కృష్ణాకెనాల్‌, రాజమండ్రిలతో పాటు దువ్వాడ, అన్నవరం, సామర్లకోట, తాడేపల్లిగూడెం, ఏలూరు, గుణదల, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, శ్రీకాళహస్తి, రేణుగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్ళలో గార్డు కం లగేజీ వ్యాన్‌లు రెండు, సెకండ్‌ క్లాస్‌ సిట్టింగ్‌ బోగీలు ఆరు, స్లీపర్‌ క్లా్‌స బోగీలు ఏడు, 3-టైర్‌ ఏసీ బోగీ ఒకటి, 2-టైర్‌ ఏసీ బోగీ ఒకటి ఉన్నాయి.

హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో కుప్పకూలిన భవనం

02:35:00 Add Comment

 నగరంలోని ఫిల్మ్‌నగర్‌లో ప్రమాదం జరిగింది. ఫిల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం ఉన్నట్టుండి కుప్పకూలింది. దీంతో శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారు. ఇప్పటికే రెండు మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీశారు. ఆ ఇద్దరూ కూలీలుగా తెలుస్తోంది.  మరో 20 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. ఎనిమిది పిల్లర్లు నేలమట్టమయ్యాయి. నగరంలో రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో పోలీసులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. సినిమా ఛాన్స్‌ల కోసం ఎక్కడెక్కడ నుంచో వచ్చే వారితో నిత్యం ఫిల్మ్‌నగర్ కిటకిటలాడుతోంది. అలాంటి చోట ఈ ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు.కల్చరల్ సెంటర్ కు దగ్గర ఓ భవనం నిర్మాణం అవుతోంది. శనివారం రాత్రి శ్లాబ్ నిర్మాణం వేసినట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం కొంతమంది కూలీలు పని చేసేందుకు వచ్చారు. 11.30 గంటల సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్ధం వచ్చినట్లు స్థానికులు పేర్కొన్నారు. 14 ఫిల్లర్లు నేలమట్టమైనట్లు తెలుస్తోంది. పని చేస్తున్న కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారు. వెంటనే స్థానికులు అప్రమత్తమై కూలీలను కాపాడేందుకు ప్రయత్నం చేశారు. సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 20 మంది కూలీలకు గాయాలు కావడంతో వీరిని అంబులెన్స్ లో సమీప ఆసుపత్రులకు తరలించారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. నిర్మాణం విషయంలో నాణ్యత లోపించడం వల్లే భవనం కుప్పకూలిందని తెలుస్తోంది. భవనానికి సంబంధించిన వారు అందుబాటులోకి లేకపోవడంతో ఎలాంటి సమాచారం తెలియడం లేదు.
ఎంత మంది కూలీలు పనిచేస్తున్నారు ? కూలిన సమయంలో ఎంత మంది కూలీలు ఉన్నారు ? శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారు ? అనే వివరాలు తెలియరావడం లేదు. కొద్దిసేపట్లో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. 

నాగార్జున స్వయంగా పాడిన పాట

22:12:00 Add Comment



శ్రీకాంత్‌ కుమారుడు రోషన్‌ హీరోగా పరిచయమౌతున్న 'నిర్మలా కాన్వెంట్‌' చిత్రంలోని కొత్త కొత్త భాష.. అనే పాటను హీరో అక్కినేని నాగార్జున పాడారు. ఈ పాట వీడియోను నాగార్జున్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా విడుదల చేశారు. ఎప్పటిలాగే కొత్తగా ప్రయత్నించా.. అని ట్వీట్‌ చేశారు. నాగార్జున అప్పుడప్పుడు గెస్ట్ రోల్ లో తళుక్కున మెరుస్తుంటారనే సంగతి తెలిసిందే. మనసుకు నచ్చితే, సినిమాకి అవసరమనుకొంటే ఆయన ఏమాత్రం ఆలోచించరు. త్వరలో నాగ్‌ రెండు చిత్రాల్లో అతిథిగా సందడి చేయబోతున్నారు. శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా పరిచయమవుతున్న 'నిర్మలా కాన్వెంట్‌'లో నాగార్జున ఒక చిన్న పాత్రలో కనిపించనున్నారు. నాగార్జున సొంత సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. 'నిర్మలా కాన్వెంట్‌' చిత్రానికి జి. నాగకోటేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నాగార్జున ఓ ప్రత్యేక పాత్రను పోషిస్తూ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. రోషన్‌ సరసన శ్రేయాశర్మ నటిస్తున్నారు. జై చిరంజీవ, దూకుడు, రోబో వంటి చిత్రాల్లో బాలనటిగా నటించిన శ్రేయాశర్మ ఈ చిత్రంలో రోషన్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో సితారామరాజు సినిమాలో నాగార్జున సిగరెట్ గురించి ఓ పాట పాడారు. ఇపుడు మళ్లీ ఇన్నాళ్ల తర్వాత 'నిర్మలా కాన్వెంట్'లో పాట పాడుతునప్నాడు. నాగార్జున ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో రోషన్‌, శ్రేయా శర్మ హీరోహీరోయిన్లు కాగా ఆదిత్య మీనన్‌, సత్యకృష్ణ, సూర్య, అనితా చౌదరి, సమీర్‌, తాగుబోతు రమేష్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: రోషన్‌ సాలూరి, సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి.విశ్వేశ్వర్‌, నిర్మాణం: అన్నపూర్ణ స్టూడియోస్‌, మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌, దర్శకత్వం: జి.నాగకోటేశ్వరరావు.

స్టాలిన్‌ నేతృత్వంలో ఆంధ్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన

01:29:00 Add Comment

పాలారులో చెక్‌ డ్యాం ఎత్తు పెంచుతున్న ఆంధ్రప్రభుత్వ వైఖరికి నిరసనగా డీఎంకే కోశాధికారి స్టాలిన్‌ నేతృత్వంలో మంగళవారం వేలూరులో ఆందోళన జరుగుతుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌ తెలిపారు. వేలూరు జిల్లా డీఎంకే కార్యవర్గం అత్యవసర సమావేశం ఆదివారం ఉదయం కాట్పాడి ఎమ్మెల్యే దురైమురుగన్‌ అధ్యక్షతన జరిగింది. తమిళనాడు జీవనాధారాన్ని దెబ్బతీసే విధంగా పాలారులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన చెక్‌డ్యాం ఎత్తు పెంపు పనులు అడ్డుకోలేని తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు. తర్వాత విలేకరులతో దురైమురుగన్‌ మాట్లాడుతూ తమిళనాడు ప్రజల జీవనాధారాన్ని దెబ్బతీసే విషయాలపై అన్నాడీఎంకే నేతృత్వంలోని ప్రభుత్వం దృష్టి సారించడం లేదని విమర్శించారు. ప్రస్తుతం పాలారులో చెక్‌డ్యామ్‌ ఎత్తు పెంపు నిర్మాణ పనులను అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేయలేదని, ఈ విషయమై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించడానికి కూడా ప్రయత్నించలేదని ఆరోపించారు. పాలారులో ఆంధ్ర ప్రభుత్వం చెక్‌డ్యామ్‌ ఎత్తును పెంచితే అది తిరువణ్ణామలై, కాంచీపురం, వేలూరు జిల్లా రైతుల జీవనాధారాన్ని ఘోరంగా దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాల వైఖరికి నిరసనగా వేలూరు కలెక్టరు కార్యాలయం వద్ద డీఎంకే కోశాధికారి స్టాలిన్‌ అధ్యక్షతన మంగళవారం ఆందోళన జరుగుతుందని, గతంలో హొగినెకల్‌ ఉమ్మడి తాగునీటి కోసం జరిగిన ఆందోళనలో 25 వేల మంది పాల్గొన్నారని, ప్రస్తుత సమస్య మూడు జిల్లాల ప్రజలకు సంబంధించింది కావడంతో ఈ ఆందోళనలో లక్ష మంది పాల్గొంటారన్నారు. సమస్యకు పరిష్కారం లభించేవరకు ఆందోళనలు కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో డీఎంకే వేలూరు కేంద్ర జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్యే నందకుమార్‌, నగర కార్యదర్శి, ఎమ్మెల్యే కార్తికేయన్‌, కేంద్ర జిల్లా ప్రిసీడియం ఛైర్మన్‌ మహ్మద్‌ సఖి, నగర ప్రిసీడియం ఛైర్మన్‌ విజయశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

గ్రేట‌ర్ విశాఖ‌ప‌ట్నం ఎన్నిక‌ల్ల బ‌రిలోకి జ‌న‌సేన ?

22:17:00 Add Comment

గ్రేట‌ర్ విశాఖ‌ప‌ట్నం ఎన్నిక‌ల్లో కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌రిలోకి దిగుతాడ‌ని న్యూస్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. జ‌న‌సేన కార్య‌కర్త‌ల‌మ‌ని చెప్పుకునే కొంద‌రు యూత్ లీడ‌ర్స్ వైజాగ్ లో ఇప్పుడు నానా హంగామా సృష్టిస్తున్నారు. వైజాగ్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ పోటీ చేస్తుంద‌ని ప‌వ‌న్ సార్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసార‌ని క‌న్ఫామ్ చేసేస్తున్నారు. ఇక ప‌వ‌న్ స్టార్ మాత్రం ఇప్ప‌టివ‌ర‌కూ వైజాగ్ లో పోటీ చేసే విష‌యంలో ఒక ప్ర‌క‌ట‌న కూడా చేయ‌లేదు. గ‌తంలో మున్సిప‌ల్ ఎన్నిక‌లను లైట్ తీసుకునే వారేమో కానీ ఇప్పుడు ఆ ఎన్నిక‌లు పార్టీలకు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. కీల‌క న‌గ‌రాల్లో పాగా వేస్తే రాజ‌కీయంగా తిరుగు ఉండ‌ద‌నే వాస్త‌వాన్ని పార్టీలు గుర్తించాయి. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో ఇలానే పార్టీలు త‌మ స‌ర్వశ‌క్తుల‌ను ఒడ్డాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక రాజ‌ధానిగా పేరుగాంచిన విశాఖ కూడా పార్టీల‌కు ప్ర‌తిష్టాత్మ‌క‌మే. అందుకే టీడీపీ, వైసీపీ స‌హా ఇత‌ర ప్ర‌ధాన పార్టీలు వైజాగ్ పీఠంపై క‌న్నేశాయి. అందుకే ఇప్ప‌టినుంచే ప్రణాళిక‌లు ర‌చిస్తున్నాయి. మాజీ ఎంపీ , గ‌తంలో వైజాగ్ మేయ‌ర్ గా ప‌నిచేసిన స‌బ్బం హ‌రికి గాలం వేసేందుకు అటు బీజేపీ, ఇటు టీడీపీ విశ్వ ప్ర‌యత్నాలు చేస్తున్నాయి. ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల స‌మీక‌ర‌ణాలు, నాయ‌కులు, వ్యూహాలు ఇలా ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు వైజాగ్ లో మోహ‌రించాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఇప్ప‌టి సింగిల్ వ్యూహం కూడా లేని, అస‌లు ఇప్ప‌టివ‌ర‌కూ పోటీ చేస్తారో చేయారో తెలియ‌ని జ‌న‌సేన‌ పార్టీ విశాఖలో జెండా ఎలా పాత‌గ‌ల‌దు అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు రాజ‌కీయ పార్టీలు కూడా ఇదే విష‌యాన్ని చెప్తున్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మేనియా వైజాగ్ లో ప‌నిచేయ‌ద‌ని, వ‌ల‌స‌లు ఎక్కువ‌గా ఉండే ఈ న‌గ‌రంలో భిన్న రాజ‌కీయ వ్యూహాలే ప‌నిచేస్తాయ‌ని చెప్తున్నారు.

టి-కాంగ్రెస్‌ని ఆదుకునే నేత ఎవ‌రు?

22:10:00 Add Comment

కాంగ్రెస్ క‌న్ను తెలుగు రాష్ట్రాల‌పై ఉందిప్పుడు. ఓ వైపు యూపీ ఎన్నిక‌ల కోసం క‌స‌ర‌త్తులు చేస్తూనే తెలుగునాట జ‌రిగే ఎన్నిక‌లపైనా అధినేత్రి దృష్టి సారించారుట‌. 2019 ఎన్నిక‌ల గురించి దిల్లీ అధిష్ఠానం ఇప్ప‌టినుంచే పాచిక‌లు వేస్తోంది. ముఖ్యంగా తెలంగాణ ఇచ్చీ.. ఆ ప్రాంతంలో వెన‌క‌బాటు త‌నానికి కార‌ణ‌మేంటో అర్థంగాక మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు కాంగ్రెస్ పెద్ద‌లు. ఏదైతేనేం ఉత్త‌మ్ కుమార్ ని టి-కాంగ్రెస్ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించి కొత్త ర‌క్తం ఎక్కించాల‌ని ప్లాన్ చేశారు. తెలంగాణ‌లో కీల‌క‌నేత‌లంతా గులాబీ గూట్లో చేరిపోవ‌డంతో ఈ స‌న్నివేశం త‌లెత్తింది. రేసులో అర‌డ‌జ‌ను మంది ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం మాజీ క్రికెట‌ర్ అజ‌హ‌రుద్దీన్‌తోపాటు న‌టి విజ‌య‌శాంతి, మల్లు భట్టి విక్రమార్క, గీతా రెడ్డి, డీకే అరుణ, షబ్బీర్‌ అలీ మొదలైనవారి పేర్లు పరిశీలనలో ఉన్నారు. అయితే ఇంత‌మందిలో అంద‌రినీ రాముల‌మ్మ డామినేట్ చేసేస్తోందని, సినీగ్లామ‌ర్ ముందు అన్నీ ప‌రేషాన్ అవుతున్నాయ‌ని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ విజ‌య‌శాంతికే ఎక్కువ స‌పోర్టునిస్తున్నార‌ని, అలాగే అజార్ పేరును ఆయ‌న ప్ర‌తిపాదించార‌ని చెప్పుకుంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైన త‌ర్వాత మ‌ళ్లీ యాక్టివ్‌గా క‌నిపించ‌ని విజ‌య‌శాంతికి ఏ కోణంలో ప‌గ్గాలు అప్ప‌జెబుతార‌న్న వాద‌నా వినిపిస్తోంది. ఏదేమైనా రేసులో రాముల‌మ్మ టాప్ పొజిష‌న్‌లోనే ఉంది ఇప్ప‌టికి.

కంచెని మెచ్చుకున్న కేటీఆర్‌

22:05:00 Add Comment

‘కంచె’.. రెండో ప్రపంచయుద్ధ నేపథ్యంలో తెరకెక్కిన మొట్టమొదటి భారతీయ సినిమాగా ప్రత్యేకత సంపాదించుకున్న ఈ సినిమా, గతేడాది విడుదలై విమర్శకుల ప్రశంసలను అందుకోవడమే కాక, బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో పాటు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకొని సత్తా చాటింది. ఒక భావోద్వేగపూరిత కథకు, కొత్త నేపథ్యానికి జోడించి దర్శకుడు క్రిష్ చేసిన ప్రయోగానికి అప్పట్లోనే సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి మంచి ప్రశంసలు దక్కగా, తాజాగా తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.
తన రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉండడంతో కేటీఆర్ ఇప్పటివరకూ ‘కంచె’ సినిమా చూడలేకపోయారు. ఇక ఈ ఇదయం వీలు కుదుర్చుకుని సినిమా చూసిన ఆయన, దర్శకుడు క్రిష్, హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌లపై ప్రశంసలు కురిపించారు. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వ్యాల్యూస్‌ డైరెక్షన్‌ను ఆయన బాగా మెచ్చుకున్నారు. ప్రస్తుతం క్రిష్, కంచె సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 100వ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఆదిత్య 369కు పాతికేళ్లు

22:00:00 Add Comment

ఈ రోజు రిలీజై హిట్టయిన సినిమాను రెండేళ్ల తర్వాత చూస్తే ఔట్ డేటెడ్ అనిపిస్తుంటాయి. తెలుగులో అయినా.. ఇంకో భాషలో అయినా ఇలాంటి సినిమాలే ఎక్కువ వస్తుంటాయి. కానీ ఎన్నేళ్ల తర్వాత చూసినా రిఫ్రెషింగ్‌గా, ఆసక్తికరంగా, కొత్తగా అనిపించే సినిమాలు చాలా తక్కువే ఉంటాయి. ‘ఆదిత్య 369’ అలాంటి సినిమానే. 1991 జులై 18న రిలీజైందీ సినిమా. సోమవారంతో ఈ సినిమా విడుదలై పాతికేళ్లు పూర్తవుతుండటం విశేషం. పాతికేళ్ల నాటి సినిమా అయినా సరే.. ఇప్పటికీ కొత్తగా అనిపించడం ఈ సినిమా విశేషం. ఈ తరం ప్రేక్షకులు చూసినా ఈజీగా కనెక్టయిపోతారు.
ఈ సినిమాలో హీరో గతంలోకే కాక భవిష్యత్తులోకి కూడా ప్రయాణించినట్లు చూపిస్తారు. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు నిజంగానే టైం మెషీన్లో ఫ్యూచర్లోకి ప్రయాణించి ఇప్పటి పరిస్థితుల్ని అధ్యయనం చేసి ఈ సినిమాను తీశాడేమో అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే. ఆ కాలానికి అంత అడ్వాన్సడ్‌గా అనిపించింది ‘ఆదిత్య 369’. తెలుగు సినిమా చరిత్రలోనే కాక.. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఎంతో గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా ఇది.

సింగీతం అద్భుత సృష్టికి.. బాలయ్య అసమాన నటన కూడా తోడై ‘ఆదిత్య 369’ అప్పట్లో చరిత్రాత్మక విజయం సాధించింది. చరిత్రలో నిలిచిపోయింది. ఆదిత్య 369 విడుదలై పాతికేళ్లు పూర్తవుతున్న సందర్భంలోనే దీని సీక్వెల్ గురించి చర్చ జరుగతుండటం విశేషం. నిజానికి బాలయ్య వందో సినిమాగా ఈ సీక్వెలే చేయాలనుకున్నాడు. తర్వాత మనసు మార్చుకున్నాడు. ఐతే స్టోరీ బోర్డుతో సహా అంతా రెడీగా ఉన్న ఈ సినిమాను ఎప్పుడో ఒకప్పుడు మొదలుపెట్టడం ఖాయమని అంటున్నాడు బాలయ్య. 

విశాఖకు సముద్ర జలాల్లోకి ఉగ్రవాదులు !!

08:20:00 Add Comment


నవ్యాంధ్రలోని ప్రధాన నగరం విశాఖపట్నం ఇప్పుడు తీవ్రమైన ఉగ్రముప్పును ఎదుర్కొంటోందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.  ముంబైలో జరిగిన 26/11 తరహా దాడులు విశాఖపై జరగవచ్చని ఇంటిలిజెన్సు అధికారులు హెచ్చరిస్తున్నారు. లష్కరే తోయిబా (ఎల్‌ఇటి), జైషే మొహమ్మద్ (జెఇఎం), ఐఎస్‌ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థలు విశాఖపై గురిపెట్టినట్టు ఇంటిలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి.  శ్రీలంకలో ఇటీవల ఐఎస్‌ఐఎస్ ఏజెంట్లను అరెస్ట్ చేసి, వారిని విచారిస్తున్నప్పుడు ఉగ్రవాదులు విశాఖను టార్గెట్ చేసుకున్నట్టు సమాచారం ఇచ్చారు. దీంతో ఇంటిలిజెన్స్ అధికారులు భద్రతా దళాలను అప్రమత్తం చేశారు. 

విశాఖలో తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయం ఉంది. తీర భద్రతతో నౌకాదళం నిరంతరం అప్రమత్తంగానే ఉంటోంది. తూర్పు నౌకాదళం కేంద్రంగా యుద్ధనౌకలు, జలాంతర్గాములు ఎప్పుడూ అక్కడే లంగరు వేసి ఉంటాయి. దీన్ని ఆనుకునే పోర్టు, హార్బర్ ఉన్నాయి. అలాగే గంగవరం పోర్టు, స్టీల్‌ప్లాంట్, ఎన్‌టిపిసి ఉన్నాయి. ముఖ్యంగా ఉగ్రవాదులు నౌకాదళ స్థావరాలను టార్గెట్‌గా చేసుకున్నారని ఇంటిలిజెన్స్ నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. 

విశాఖకు సముద్ర జలాల్లోకి శ్రీలంక, బంగ్లాదేశ్ నుంచి ఉగ్రవాదులు చొరబడేందుకు అవకాశాలు ఉన్నాయని ఇంటిలిజెన్స్ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే స్లీపర్ సెల్స్ విశాఖలో సంచరిస్తున్నట్టు ఇంటిలిజెన్స్ అధికారులు ముఖ్యమంత్రికి నివేదిక పంపించారు. విశాఖలో భద్రతా పరంగా కొన్ని లోపాలున్నాయి. వాటిని సవరించుకుంటూ అప్రమత్తంగా ఉండాలంటూ ఇంటిలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. అలాగే షాపింగ్ మాల్స్, జన సమ్మర్థం ఉన్న ప్రదేశాల్లో భద్రత, నిఘాను ముమ్మరం చేయాలని ఇంటిలిజెన్స్ అధికారులు ఆ నివేదికలో సూచించినట్లు తెలిసింది. దీంతో విశాఖ, పరిసర గ్రామాల్లోని సాగర తీరంపై నిఘా పెంచుతున్నారు. అంతేకాకుండా సిటీలో కూడా తనిఖీలు పెంచారు

వైసీపీ గడపగడప సర్వేపై మండిపడ మంత్రి పత్తిపాటి పుల్లారావు

08:01:00 Add Comment

గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ గడపగడప సర్వేపై మండిపడ్డారు. తమ ప్రభుత్వంపై ప్రజాభిప్రాయ సేకరణ చేసే నైతికహక్కు వైసీపీకి - జగన్ కు లేదని అన్నారు. తొలుత తన పనితీరు - తనపై ఉన్న అవినీతి ఆరోపణలు - ఆస్తుల ఆటాచ్ మెంట్ పై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని పత్తిపాటి సూచించారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చామని రానున్న మూడేళ్లలో మరికొన్నింటిని నెరవేర్చుతామని చెప్పారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గడపగడపకూ వెళితే జగన్ కు - ఆయన పార్టీ నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పుల్లారావు అన్నారు. వైసీపీని విడిచి ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్లిపోయారో? నీ ప్రవర్తన ఎలా ఉందో? ప్రజల్లోకి వెళ్లి తెలుసుకోవాలని జగన్ కు హితవు పలికారు. అంతగా జగన్ కు ప్రజాబలం ఉందని భావిస్తే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికల్లోకి వెళ్లాలని ఆయన సూచించారు. ఆ ఎమ్మెల్యేలు నెగ్గితే జగన్ ప్రజాబలంపై స్పష్టత వస్తుందని అన్నారు. రెండేళ్ల టీడీపీ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని పుల్లారావు పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో అవినీతికి పాల్పడినవారిలో అనేక మంది జగన్ వద్దే ఉన్నారని వారి గురించి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని మంత్రి సూచించారు.

ఉగ్రవాదుల హిట్ లిస్టులో ముషీరాబాద్ ఎమ్మెల్యే కె.లక్ష్మణ్ ?

07:53:00 Add Comment

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు - ముషీరాబాద్ ఎమ్మెల్యే కె.లక్ష్మణ్  ఉగ్రవాదుల  హిట్ లిస్టులో ఉన్నట్లుగా తెలుస్తోంది. నిఘావర్గాలు అందించిన ఈ సమచారంతో తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఒక్కసారిగా భద్రత పెంచింది. హైదరాబాద్ సిటీలో ఉగ్రవాదుల జాడలు బాగా పెరిగిన నేపథ్యంలో బీజేపీ నేత అయిన లక్ష్మణ్ కు భద్రత పెంచారు. ఇందులో భాగంగా ఆయనకు పోలీసు రక్షణను రెట్టింపు చేశారు. ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా కేటాయించారు. 
హైదరాబాద్ లో విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేసిన ఉగ్రవాదులు వారం కిందట దొరికిపోయిన సంగతి తెలిసిందే.  అయితే.. ఉగ్రవాదుల ఇంకా ఉండవచ్చని.. వారు బీజేపీ నేతలను టార్గెట్ చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. నిఘావర్గాలు కూడా ఇందుకు సంబంధించి పక్కా సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అందించినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా లక్మణ్ ఐఎస్ ఐఎస్ హిట్ లిస్టులో ఉన్నారని తెలుస్తోంది. గతంలోనూ బీజేపీ నేతల ఇళ్ల వద్ద ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించారనడానికి ఆధారాలున్నాయి. ఐఎస్ టెర్రరిస్టులు ముస్లిమేతర పార్టీల నేతలను టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో అత్యధిక ముప్పు లక్ష్మణ్ కే ఉందని పోలీసులు చెబుతున్నారు. అందులో భాగంగానే ముందు జాగ్రత్తకు ఆయనకు గట్టి భద్రత కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

క‌శ్మీర్ నుంచి హైద‌రాబాద్ వ‌చ్చిన రామ్‌చ‌ర‌ణ్‌

11:18:00 Add Comment

రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర‌వింద్ నిర్మిస్తున్న సినిమా `ధృవ‌`. ఈ సినిమా శ‌ర‌వేగంగా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్ ఈ చిత్రంలో ఓ సిన్సియ‌ర్ పోలీస్ అధికారిగా న‌టిస్తున్నారు. కాప్ లుక్‌కి అవ‌స‌ర‌మైన విధంగా రూపు రేఖ‌లు మార్చుకుని చెర్రీ వెరీ స్మార్ట్‌గా క‌నిపిస్తున్నాడు. ప్ర‌స్తుతం క‌శ్మీర్‌లో చిత్రీక‌ర‌ణ సాగుతోంది. అక్క‌డ 10 రోజుల పాటు టాకీతో పాటు, ఓ సాంగ్‌ని చిత్రీక‌రించారు. క‌శ్మీర్ షూట్ పూర్తి చేసుకుని చ‌ర‌ణ్ నేటి (గురువారం) సాయంత్రం  హైద‌రాబాద్‌లో అడుగుపెట్టారు. 

`ధృవ‌` ఫ‌స్ట్‌లుక్ త్వ‌ర‌లోనే రిలీజ్ కానుంది. అయితే ఈలోగానే క‌శ్మీర్ ఆన్‌లొకేష‌న్ స్టిల్ ఒక‌టి అంత‌ర్జాలంలో హ‌ల్‌చ‌ల్ చేసింది. ఈ స్టిల్‌లో చ‌ర‌ణ్ లుక్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్‌లో, జ‌నాల్లో టాక్ వ‌చ్చింది. చ‌ర‌ణ్ మునుప‌టి కంటే స్మార్ట్‌గా క‌నిపిస్తున్నాడంటూ ప్ర‌శంస‌లొచ్చాయి. గీతా ఆర్ట్స్ ప‌తాకంపై అల్లు అర‌వింద్ ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా మాతృక `త‌ని ఒరువ‌న్‌`లో విల‌న్‌గా న‌టించిన అర‌వింద్ స్వామి ఈ చిత్రంలోనూ విల‌న్‌గా న‌టిస్తున్నారు. ర‌కూల్ ప్రీత్‌సింగ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ధృవ చిత్రంలో తెలుగు ప్రేక్ష‌కుల‌కు కోరుకునే అన్ని అంశాలు ఉంటాయి. చ‌క్క‌ని స్టోరీ, గ్రిప్పింగ్‌ స్ర్కీన్‌ప్లేతో  తెర‌కెక్కుతోందని చిత్ర‌యూనిట్ చెబుతోంది. (రామ్‌చ‌ర‌ణ్ శంషాబాద్ (హైద‌రాబాద్) ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టిన‌ప్పుడు కెమెరా కంటికి చిక్కారిలా.  కెమెరా క్లిక్కుల్లో దొరికిన స్టిల్స్ ఇవి).